Wednesday, April 23, 2008

ధైర్యలక్ష్మి

ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు ప్రదర్శించినపుడే లక్ష్మి మనలను వరిస్తుంది. ఈ ప్రపంచములో ధైర్యమునకు మించిన గొప్ప సుగుణము మరొకటి లేదు. అందులకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్షుధ్రమైన హృదయ దౌర్భల్యమును వీడి కర్తవ్యమును నిర్వర్తించమని అర్జునునకు ఉపదేశించాడు. ఏ పనిని ప్రారంభించినా ధైర్యముతో మొదలుపెట్టి చివరివరకు పోరాడి కార్యాన్ని సాధించమని పెద్దలు చెప్పారు. ఏది జారినా మరల సవరించుకోవచ్చు గాని, గుండె గనక జారిందా మన పని గోవిందా! తప్పు అసలు చేయకూడదు. తప్పుచేయడం తప్పనిసరియైనపుడు అత్యంత ధైర్యముతో చేయమన్నారు స్వామి వివేకానంద. పిరికితనం ఏ రంగంలోనూ పనికిరాదన్నారు విజ్ఞులు. మన అభిప్రాయాలను, ఆశయాలను నిర్భయముగా ప్రకటించుకొనే ధైర్యాన్ని మనం సంపాదించు కోవాలి. ఇతరులు ఏమను కుంటారో అని సత్యాన్ని వక్రీకరించడం ఆత్మ ద్రోహమే అవుతుంది.

శతకోటి సింగబలము, అకుంఠిత దృఢ సంకల్పం, అఖండ ధైర్య సాహసాలు అద్భుత కార్యసాధనకు అత్యంత ఆవశ్యకములు. సుగుణములలో ధైర్యగుణము మొదటిది. ఆందులకే మహాభారత సంగ్రామములో అర్జునుడు మాయా మోహితుడై ధైర్యము కోల్పోయి యుద్ధము చేయనని చతికిలబడ్డపుడు శ్రీకృష్ణుడు రకరకములైన ఉపమానములతో ధైర్యాన్ని నూరిపోసి, మమకార భావమును తొలగించి, యుద్ధానికి సన్నద్ధం చేశాడు.

మానవ జీవితంలో నిత్యకృత్యాలలో ధైర్యం ప్రదర్శించాలంటే ముందుగా నిత్యానిత్య వస్తు వివేచన చాలా అవసరము. అంటే ముందుగా మనం జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు మనకు ధైర్యము దానంతట అదే వస్తుంది. మనస్సు దృఢంగా, స్ధిరంగా ఉండాలి. మనస్సు బలహీనపడినపుడే మాయలు, మంత్రాలు, మహత్తులు, యంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, గారడీ విద్యలు పనిచేస్తాయి. ఆ బలహీన క్షణంలోనే క్షుధ్రశక్తులు మనస్సును లొంగదీసుకుంటాయి.

నకిలీ స్వాములు, బాబాలు, అమాయక ప్రజలను క్షుధ్ర లీలలతో విచిత్రాలు చూపించి మనస్సును బలహీనపరచి అన్ని విధాలా దోచుకుంటారు. ఓక్కసారి మనస్సు గట్టిపడి, పూర్తిగా వశమై, సాత్వీక స్వభావముతో నిండిపోతే ఇక ఇవేవీ నీవద్ద పనిచేయవు. మనం వాటిని నమ్మవలసిన పనేలేదు. అందుకే మనం ముందుగా స్ధిరచిత్తులమై, గంభీర స్వభావాన్ని కలిగి ఉంటే, మనపై మనకు పూర్తి విశ్వాసం ఏర్పడితే ఈ ప్రపంచములోగల ఏశక్తి మనలను ప్రలోభపెట్టలేదు. ఎవరి చెడు ప్రేరణకు మనం ఎంతమాత్రం లొంగిపోము.

- నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home