Saturday, April 26, 2008

కోపం – నిగ్రహం

నిత్యజీవితంలో సమస్యల వత్తిడివల్ల అప్పుడప్పుడు కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. అసలు మనిషికి కోపం రావడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే – మనకు నచ్చని విషయాలు జరిగిపోతున్నప్పుడు, మనలోని తప్పులను ఇతరులు ఎత్తిచూపినప్పుడు సాధారణంగా అసహనం, కోపం కలుగుతుంది. మనలో ఏవో కొన్ని లోపాలుంటేనే ఎదుటివారు మనలను వేలెత్తి చూపెడతారు. అప్పుడు వెంటనే కోపం ప్రదర్శించక, ఆత్మ పరిశీలన గావించుకొని, మనలోని లోపాలను సవరించు కున్నట్లైతే కోపం వచ్చే అవకాశమేలేదు.

కొన్ని సార్లు కోపం వల్ల మనస్సు పాడైతే మరికొన్ని సందర్భాలలో అందుబాటులోగల వస్తువులు తమ ఆకృతిని కోల్పోతాయి. ఎటొచ్చి మరల కస్టపడి పగిలిన వస్తువులను తిరిగి కొనుక్కోవలసింది మనమేనన్న విషయం కోపంతో ఊగిపోయినప్పుడు మనకు స్ఫురించదు. అందుకే కోపం వచ్చినప్పుడు ఒకటినుండి పదివరకు లెక్కించమన్నారు పెద్దలు. ఈ లోపల
కోపం తగ్గే అవకాశముంది. ఇంకా ప్రశాంతంగాఅలోచిస్తే ఎదుటివారి మటల్లోకూడా సత్యమున్నదనే విషయం బోధపడుతుంది. “కోపం పాపం – శాంతం దైవ స్వరూపం” అన్నారు విజ్ఞులు.

శాంతం ప్రశాంతమైన మనస్సుకు, ఆనందమయ జీవితానికి దోహదం చేస్తుంది. మనిషి ఎల్లప్పుడు ప్రసన్న వదనంతో, విశాల హృదయంతో జీవించాలి. జీవన గమనంలో పరమానందాన్ని అనుభ వించాలి. ఆనందమే జీవన సారం. మనం ఆనందపుటంచులను చవి చూడాలంటే మనస్సు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి. పెదవులపై చిరునగవు తొణికిసలాడాలి. ఇవి మనిషిలోని అంతరంగ భావనలకు గీటురాళ్ళు. భూమాత సహనానికి ప్రతీక. సహనముంటేనే స్వామి ప్రసన్నం కాగలడు. బ్రతుకును బంగారు బాటగా మార్చగలడు.

తెలిసో తెలియకో నిత్యజీవితంలో మనలను ఎవరో ఒకరు సూటిపోటి మాటలతో పట్టరాని కోపం తెప్పిస్తుంటారు. తమ సంకుచిత భావంతో ఎదుటివారి మనస్సును గాయపరుస్తూ, ఇబ్బందికి గురిచేస్తూ ఉంటారు. అంతమాత్రం చేత మనం సహనాన్ని కోల్పోవలసిన్ అవసరం ఎంతమాత్రం లేదు. మన సహనమే మనకు శ్రీరామ రక్ష.

కోపం వల్ల వివేకం నశిస్తుంది. తద్వారా ఎన్నో అనర్ధాలు సంభ విస్తాయి. కావున అనేక అనర్ధాలకు కారణమైన కోపాన్ని ఎలాగైనా జయించాలి. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన గావించుకొని, మనస్సును అదుపులో పెట్టుకొని కోపాన్ని జయిద్దాం. శాంతమూర్తులమై స్వామి కృపకు పాత్రులమౌదాం.

నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home