Monday, April 28, 2008

మృత్యు స్మరణ

మనకొచ్చిన చిక్కల్లా ఆపద మొక్కుల వల్లే. నేటి యాంత్రిక జీవన యానంలో మనిషికి ఈ క్షణం గడిస్తే చాలు, ఈ రోజు ముగిస్తే పదివేలు అన్నట్లుగా ఉంది. ఈ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడిచి పోతే చాలు. రేపటి సంగతి మనకెందుకు. జీవిత చరమాంకమైన మృత్యువు ఊసంటేనే గిట్టని పరిస్ధితి.

శరీర నిలుకడకు, ఇంద్రియాల అనుభవానికి మూలమైన ఆత్మ శక్తి గురించి
తెలుసుకోవాలనే ఆలోచనే తట్టదు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనే దశలు దాటి మరణమనే దశకు అందరూ ఏదో ఒకనాడు సమీపించక తప్పదనే నగ్న సత్యాన్ని మానవుడు మాయలోపడి మరచిపోతూ ఉంటాదు. శవం ప్రక్కనే కూర్చుని కూడా నేను యవ్వనంలో ఉన్నాను, మంచి ఆరోగ్యంతో ఉన్నాను అని తలుస్తూ, మృత్యువు నాకు ఇప్పట్లో రాదులే అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వచ్చినా ఎప్పుడో వస్తుందికదా, అప్పుడు చూద్దాంలే అని ఆలోచిస్తాం.

మన కళ్ళెదుట నగ్న సత్యాలు కనిపించినా, చరిత్ర గుణపాఠాలు వినిపించినా బుర్రకెక్కదు. లోక మాయకు వశమై, దృశ్యమాన ప్రపంచమే శాశ్వతం, సర్వస్వ మని భావిస్తూ, దేహాభిమానులమై జీవిస్తు న్నాం. మన రక్త సంబంధీకులో, బంధువులో, తెలిసినవారో మరణిస్తే ఏడుస్తాం, బాధపడతాం. ఆది శంకరులవారి ఉపదేశం ప్రకారం ఏడవవలసి వస్తే లోకంలో ఎవరు చనిపోయినా ఏడవాలి. అది మనకు ఎలాగూ సాధ్యం కాదు. లేదా ఎవరు చనిపోయిన ఏడవకుండా ఉండాలి. సాధన చేస్తే ఇది సాధ్యమే. అనివార్యమైన శరీర పతనమును గూర్చి విలపించడం అజ్ఞానమే అంటున్నారు.

మన రక్త సబంధీకులు, ఆత్మీయులు శరీరం చాలించినపుడు దు:ఖం రావడం సహజం. కాని ఆ మరణం మనకు కూడా ఏదో ఒక రోజున రాక తప్పదని ప్రతివారు గ్రహించాలి. మృత్యువు ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు. సాధారణంగా మనం చాలా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తుంటాం. మృత్యువు మన దరిదాపులకు ఇప్పట్లో రాదని తలపోస్తుంటాం. కాని విధి ఏమాత్రం వక్రించినా, ప్రమాద రూపం లోనో, రుగ్మత రూపంలోనో తరుముకొని వచ్చి జీవితాన్ని కబళించి వేస్తుంది. ఆ పరమేశ్వరుడి పిలుపు ఎప్పుడు వినిపిస్తుందో ఊహించలేము.

అందులకై మానవుడు ఎల్లప్పుడు మృత్యుదేవత గురించి ఆలోచించాలి. మృత్యువు ఈశరీరాన్ని కబళించేలోగా మంచి పనులు చేస్తూ మాధవుని
అనుగ్రహం పొందాలి. నిస్వార్ధ జీవితం గడిపి జన్మ చరితార్ధం చేసుకోవాలి.

నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home