Sunday, June 22, 2008

దైవ అనుభూతి

సత్యాన్వేషణ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. సత్యాణ్వేషణ నిమిత్తం అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అవసరంలేదు. ప్రతిదినము వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సలుపవలయును. ఇక కర్మ క్షేత్రంలో ఏ ఆటంకములు, విఘ్నములు ఏమి చేయలేవు. క్రమంగ సర్వత్ర ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఈ దశలో అంతయు యోగశక్తిగ మీ పనులు సాగిపో గలవు. అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు. మిధ్యా నేనును, సైతాన్ భ్రాంతిని వదలాలి. ఇది అసలైన సన్యాసం, పరివ్రాజక స్ధితి. ముందుగ నిన్ను నీవు సన్యసించుకో. నిన్ను విసర్జించిన అసలైన నేను శేషిస్తుంది. ఆ నేనే సర్వలోకములకు వెలుగు. ఇదియే విశ్వగర్భ దైవ నేను. సంకుచిత, పరిమిత నేను అంతర్ధానమైనపుడు ఆత్మ కేంద్రంలో నిజమైన సత్య దైవ నేను వెలుగును. అరణ్య మధ్యంలో యున్నను కల్లోలిగ మనసుకు శాంతిలేదు. ఎటు వ్యవహరించినా శిరస్సును ప్రశాంతంగ ఉంచినచోట ఏకాంతం మానసికా వస్ధ. సర్వకాలాలకు చెందిన సత్యాత్మ స్వరూప స్వభావమే నిజముక్తి. ఇది ఫలానా వారికనే నిబంధనలేదు. మనో పరిపక్వత ననుసరించి ఎవ్వరైనను పొందవీలున్నది. ప్రతివారి చరమ లక్ష్యం ఇది. మోక్షానికి అడ్డు నిలిచే మిధ్యా నేనును తొలగించాలి. మానసిక అభ్యంతరాలు రహితం కావాలి. పరిస్దితుల మార్పుకన్న మనో మార్పు ముఖ్యం. ఈ మారు మనసే ఆత్మదర్శనకారి. ఏ వ్యక్తిగాని బహిర్గతమైన ప్రవర్తనవల్ల హక్కులను పొందలేడు. అతనెంతవరకు సత్యస్వరూపుడో అంతవరకే అతని హక్కులు పరిమితమై యుండును. అతని సత్యానికి కొలబద్ద అతని చైతన్యమే. ఈ చైతన్య స్వాతంత్ర్యము పొందడానికి ప్రతివ్యక్తి తన క్షుధ్ర అహమును విసర్జించాలి. గీతాసారమంతయు ఇందులోనే గలదు.

భారతీయులు భావించి, భాషించే అనంతం అనేది లోన సరకులేని శూన్యం కాదు. అనంతుని ఈ జీవితంలో తెలుసుకోవటమే ముక్తి. అన్నిట, అంతట ఆ విశ్వ విధాత స్వరూప స్వభావమును గుర్తించటమే నిజమైన దృష్టి. శైశవదశ లోని పిల్లలకు నడక నేర్పునట్లు యాత్రలన్నియును సదుద్దేశ్యముతో ఏర్పరుచ బడినవే. ఐనను అవియే సర్వస్వములు కావు. యాత్రలతో ఆగిపోరాదు. భూలొక యాత్రలన్నియును కర్మకాండలోనివే. ఆపై ఉపాసన, జ్ఞాన కాండలు గలవు. త్రికాండముల మీరినపుడే పరిపూర్ణ సిద్ధి. అంతొ ఇంతో గొప్పతనము, మహిమ, ప్రభావం లేనిదే లక్షలమంది యాత్రలు చేయటం ఎందుకని అనేవారుంటారు. అది నిజమేగాని “యద్భావం తద్భవతి” యన్నట్లు ఎవరి భావన ఎట్లుండునో బయట అలాగే కనిపిస్తుంది. అలాగే జరుగుతుంది. యాత్రలు చేయువారు దైవ భావనతో వెళ్ళెదరు. అదే ప్రభావం చూపుతుంది. ఆందరి వ్యక్తుల దైవభావం ఎక్కడ కేంద్రీకరించబడునో అక్కడ అమోఘ ప్రభావం గోచరించును. యాత్రలన్నియును ఒకింత ఆధ్యాత్మిక మార్గ సాధనలేగాని, జన్మ రాహిత్య సిద్ధి తన్ను తా తెలియక ఏ యాత్రలలో లేదు. అలాగని యాత్రలు నిరర్ధక ములు, చేయరాదని కాదు. అవి ప్రాధమిక దర్జాలని తెలియాలి. ఆ అంగడి గోలలు తగ్గించి మౌన ప్రకాశమును దర్శించవలయును. ఈ భూలోకంలోని సర్వమత సంబంధ క్షేత్రములు, యాత్రలన్నియును ‘నేను’ యనెటి కేవలఖండ ‘దైవ నేను’ ఉనికిలోనివేనని తెలియాలి. మీరు చేయు యాత్రలు మీలో పరివర్తన తేవాలి. దుష్ట తలంపులను విసర్జించి దివ్య భావ శక్తి ప్రేరణతో ఇల్లు చేరాలి. అంతేగాని తల నీలాలు ఇచ్చి రాగానే సరిపోదు. చివరకు సంచారముల బందుచేసి నిలుకడపొంది, తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే భారతీయుల విగ్రహారాధనలోని అమోఘ రహస్యము. ద్రోణాచార్యుని విగ్రహమును సజీవమూర్తియైన ఆచార్యునిగ నిలుపుకొని ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుని మించిపోయాడు. ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే విశ్వేశ్వరుడు బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరనెటి క్రీస్తువాణి సత్యము. విద్యార్ధులందరు పాఠశాలలో ఎవరి మేధాశక్తి ననుసరించి వారు చదివినా చివరకు ఐ.ఏ.ఎస్,, ఐ.పి.ఎస్., కోర్సులలో చేరుటకు ప్రతిభయే ప్రధానం కావున చాలామంది తప్పిపోయి ప్రవేశ పరీక్షలోనే ఆగిపోగలరు. అతి మేధా సంపన్నులే పై చదువులకు ఎంపిక కాబడునట్లు యాత్రలెన్ని చేసినను, అతిమానస భూమిక నధిరోహించి మోక్ష సిద్ధికి అర్హులైనవారి సంఖ్య స్వల్పాతి స్వల్పమని విజ్ఞులు గ్రహించాలి. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త భగవంతులు నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి అఖండ భావ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. జీవాత్మకు వినాశం లేదు. శక్తి పూరించబడునది తగ్గేది కాదు. శక్తి నశించదు, చావదు. హెచ్చు తగ్గులు దీనికి లేవు.

సప్త జ్ఞాన భూమికలను అధిరోహించటమే నిజమైన సప్తాహం. ఏడుకొండలపైనున్న సప్తగిరి వాసుడు తిరుమల వేంకటెశ్వర స్వామి దర్శనం. దీనికి మరియొక ఆంతర్యం సహస్రార ప్రవేశం. భేద భావము ఎంతమాత్రం కానరానిదే నిష్కళంక ప్రేమ. ఈ ప్రేమవల్ల ఆత్మ తన పరిధులను దాటి అనంతంవైపు పయనించి, పరిపూర్ణతను సిద్ధించుకుంటుంది. ఇట్టి మహత్తర ప్రేమశీలురకు శరీరధారులమనే దృష్టి అంతరించి, సర్వాంతర్యామితో తమకు అతి సన్నిహితమైన సంబంధముగలదని నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ స్ధితికి ఎదగాలి. ఐక్యత, ఏకత్వము అనెటి భావము మానవ ఆత్మలో సదా ప్రచురితమయ్యే యున్నది. ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ కుమారుడు నీ ఆత్మయే గనుక ప్రేమించుచున్నావు. మమాత్మా సర్వ భూతాంత రాత్మ. ఈ ప్రేమే కొత్త శక్తిని, అంతర్దృష్టిని, మానసిక సౌందర్యాన్నిస్తుంది. మనసు వ్యాకోచము చెందగలిగినంత మేర సౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే దోహదం చేస్తుంది. ఆత్మ జ్యోతియొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. శిశువు తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.

మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుంది. అజ్ఞానియైన మానవుడు తన కోర్కెలలో కూరుకుపోయి అట్టి ఊబిలో నుండి బయటికి రాలేకపోవుచున్నాడు. ఇదియే కడు దౌర్భాగ్యము. ఈ దీన, హీన స్ధితినుండి బయటపడుటకే యిన్ని రకముల అర్చన, ఆరాధన, ప్రార్ధనాలయములు కావలసి వచ్చినది. ఎవరి మానసిక స్ధాయి, అభిరుచి ననుసరించి వారి ఆరాధన క్రియలుండును. మానవాత్మ దైవార్పితమైనపుడు తన ద్వారా దైవేచ్చ ధరణిపై క్రీస్తువలె నెరవేరుతుంది. శ్రీరామచంద్రుడు తాను బోధించిన ఆత్మజ్ఞానము ఆంజనేయునిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు హన్మంతుని సమాధానము: 1. దేహ బుద్ధ్యా దాసోహం 2. జీవ బుద్ధ్యా త్వదంశకం 3. ఆత్మ బుద్ధ్యా త్వమేవాహం. ఇది విని రాముడు సంతసించి నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను. మీలో ఎవరు ఏదశలో ఉన్నారో పరిశీలించుకొని ఆత్మ బుద్ధ్యావతరణ గావించుకో వాలి. సమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వెలుగు మనసుకు వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. ఈ వాక్యంలోని ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు ముక్కుసూటి దారి.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home